బీజేపీకి మద్దతిస్తూనే..కమల్‌ స్నేహం కోరిన రజనీ…!

399
rajinikanth
- Advertisement -

ఎన్నికల వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 2019కి ముందు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీ ఈ సారి ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. దీంతో రజనీ ఎవరికి మద్దతిస్తారో అని తమిళ తంబీలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్ధాపించి ఎన్నికల బరిలో నిలిచిన కమల్ తనకే రజనీ మద్దతిస్తారని ప్రకటించారు.

కమల్ వ్యాఖ్యలపై స్పందించిన రజనీ తాను ఆయనకు మద్దతివ్వడం లేదని చెప్పారు. అంతేగాదు ఏదో ఊహించుకుని..దీనిని చర్చనీయాంశం చేసి తమ స్నేహాన్ని దెబ్బతీయొద్దని ప్రజలను కోరారు.అయితే అదే సమయంలో బీజేపీ మేనిఫెస్టోని స్వాగతించారు. మేనిఫెస్టో అమలు చేస్తే నదులు అనుసంధానం అవుతాయని అన్నారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడే నదుల అనుసంధానం ప్రాజెక్టు గురించి చర్చించానని ఆయన కూడా నా ఆలోచనకు సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టును తీసుకొస్తామని 2019 మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. ఇది నిజంగా జరిగితే ప్రజలు చాలా సంతోషిస్తారు అని తెలిపారు రజనీ.

ఇక తమిళనాడులో ఏప్రిల్ 18న లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 40 స్థానాలుండగా ప్రధానంగా అన్నాడీఎంకే,డీఎంకేల మధ్య పోటీజరగనుంది. ఇక కమల్ సైతం 40 స్ధానాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటించి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

- Advertisement -