జయం, నువ్వునేను వంటి చిత్రాలతో అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ తేజ. చాలా గ్యాప్ తర్వాత బాహుబలి స్టార్ రానాతో నేనే రాజు నేనే మంత్రి అనే ఓ ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీని తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.
దివంగత నిర్మాత డి.రామానాయుడు జయంతి సందర్భంగా ఈ చిత్ర టీజర్ను నేడు రానా తన ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. టీజర్లో రానాకు ముసుగు వేసి ఉరి వేయడానికి తీసుకెళుతుంటారు. అప్పుడు పోసాని కృష్ణ మురళి.. పుట్టిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టకా తప్పదు.. ఆమెన్ అంటారు. దానికి దీటుగా రానా.. ‘నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా.. నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా. నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి’ అని చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో రానా రాధా జోగేంద్ర అనే మంత్రి పాత్రలో నటిస్తున్నాడు. రానాకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. డి.సురేశ్బాబు, కిరణ్రెడ్డి, భరత్ చౌదరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.