దేశ ఆర్థిక రాజధాని ముంబయిని కుదిపేసిన 1993 వరుస పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పు వెలువరిచింది. ఈ కేసులో అబు సలెం, ముస్తాఫా దోసా సహా ఏడుగురిని దోషులుగా నిర్ధారించింది. కుట్ర ఆరోపణలు, హత్య, ఉగ్ర కార్యకలాపాల తదితర నేరాల కింద వీరిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. త్వరలో వీరికి శిక్షలను ఖరారు చేయనుంది న్యాయస్ధానం.
ముంబై పేలుళ్ల కేసులో సుమారు 100 మందికిపైగా నిందితులు ఉన్నారు. 1993లో జరిగిన పేలుళ్లలో సుమారు 275 మంది మరణించారు. మరో 713 మంది గాయపడ్డారు. ఆ ఘటనలో సుమారు 27 కోట్ల ప్రాపర్టీ ధ్వంసమైంది.
ఈ ఘటనలో 2007లో టాడా కోర్టు తొలి దశ విచారణను పూర్తి చేసింది. అందులో 100మందిని నిందితులుగా గుర్తించగా.. మరో 23 మందిని నిర్దోషులుగా పేర్కొంది. అయితే ఈ ట్రయల్ పూర్తయిన తర్వాత ఈ కేసులో అబు సలెం, ముస్తాఫా దోసా, కరిముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్ మర్చంట్, అబ్దుల్ ఖయ్యుంలను కీలక నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పేలుళ్ల కేసులో మళ్లీ రెండో దశ విచారణ చేపట్టారు. రెండోదశలో అబుసలెం, ముస్తాఫా సహా ఏడుగురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు యాకుబ్ మేనన్కు 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. 2015 జులై 30న యాకుబ్ను ఉరితీశారు.
అబూ సలెమ్ను 2005లో పోర్చుగల్ నుంచి పట్టుకొచ్చారు. గుజరాత్ నుంచి ముంబైకి సలెమ్ మారణాయుధాలను సరఫరా చేశాడన్న అభియోగాలు ఉన్నాయి. ఆ ఆయుధాలను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు కూడా అప్పగించింది అబూ సలెమే. ఏకే 56 రైఫిళ్లు, బుల్లెట్లతో పాటు హ్యాండ్ గ్రేనేడ్లు కలిగి ఉన్న కేసులో సంజయ్ దత్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబై లో జరిగిన ఆర్డీఎక్స్ పేలుళ్లకు సూత్రధారి ముస్తాఫా డోసా అని తెలింది. సుమారు మూడు వేల కిలోల ఆర్డీఎక్స్ను డోసా ఉగ్రమూకలకు అందించినట్లు అనుమానాలున్నాయి. ముంబై పేలుళ్ల కేసుతో తనకు లింకు ఉన్నట్లు గ్యాంగ్స్టర్ అబూ సలెమ్ సీబీఐ విచారణ ముందు అంగీకరించారు.