కేటీఆర్ చొరవతో సిరిసిల్లకు సమీర్‌..

341
ktr sameer
- Advertisement -

గల్ఫ్ ఏజెంట్ల మోసాలు రోజుకోకటి వెలుగుచూస్తున్నాయి. తాజాగా గల్ఫ్ ఏజెంట్ మోసానికి గురై సౌదిలో సిరిసిల్ల యువకుడు సమీర్‌ నరకయాతన అనుభవిస్తు తన బాధను వీడియో ద్వారా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించారు కేటీఆర్.

సమీర్‌ను సురక్షితంగా స్వదేశానికి రావడానికి సహకరించాలని భారత్‌లోని సౌదీ అరేబియా అంబాసిడర్ ఆసఫ్ సయీద్‌కు, రియాద్‌లోని ఇండియన్ ఎంబసీకి ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన ఇండియన్ ఎంబసీ సమీర్‌ను త్వరలోనే భారత్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలుపుతు ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీకి థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్… సమీర్‌కు సంబంధించిన అప్‌ డేట్స్‌ ఎప్పటికప్పుడు అందివ్వాలని కోరారు.తన కొడుకు విషయంలో చొరవ తీసుకుని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్న కేటీఆర్‌కు సమీర్ తల్లి రఫియా కృతజ్ఞతలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ సమీర్‌ పొట్టకూటి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. పాం హౌస్‌లో పని చెప్పి సౌది తీసుకెళ్లిన ఏజెంట్..సమీర్‌ను మోసం చేశాడు. అక్కడికి వెళ్లాక గొర్రెల కాపరిని చేశారు. రోజూ సుమారు మూడొందల గొర్రెలను షెడ్డు నుంచి తోలుకెళ్లడం.. సాయంత్రానికి మళ్లీ షెడ్డుకు తోలుకురావడం ఇదే పని. వాటిని మేపలేక స్వదేశానికి వెళ్లిపోతానంటే గొడ్డును బాదినట్లు బాదుతున్నారని నెల రోజులగా సరిగా తిండి కూడా పెట్టడం లేదని తన గోడును వెళ్లబోసుకున్నాడు.

అంతేగాదు సమీర్ బాధతో అల్లాడిపోయిన కుటుంబసభ్యులు అతడిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా సదరు ఏజెంట్‌కు రూ.50 వేలు చెల్లించారు. డబ్బులు అందిన తర్వాత ఆ ఏజెంట్ స్పందించలేదు.దీంతో తన బాధను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా కేటీఆర్‌ పెద్ద మనసుతో వెంటనే స్పందించి సమీర్‌ను భారత్‌కు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -