సినీ నిర్మాత బండ్ల గణేశ్కు హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు 6నెలల జైలుశిక్ష విధించింది. దాంతోపాటు మరో 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. వివరాలలోకి వెళితే ఎన్టీఆర్ హీరోగా 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ అనే సినిమాని నిర్మించాడు బండ్ల గణేష్. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు. అయితే కథ అందించినందుకు గాను తనకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వనందుకు వక్కంతం కోర్టుని ఆశ్రయించారు.
దీనిపై విచారించిన కోర్టు కొద్ది సేపటి క్రితం తీర్పు ఇచ్చింది. రచయిత,దర్శకుడు వక్కంతం వంశీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఈ వివాదం చాలా కాలం నుండి నడుస్తోంది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. గణేష్ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది.