జీఎస్టీపై వర్మకు మరోసారి నోటీసులు..

229
Hyd Cyber Police to Issue Fresh Notice to RGV
- Advertisement -

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పేరుతో దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ వివాదం‌ వర్మను ఇంకా వదిలేలా కనిపించడం లేదు. వర్మకు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి నోటీసులు పంపనున్నారు. ఈ లఘుచిత్ర చిత్రీకరణ హైదరాబాద్‌ లోని స్టార్‌ హోటల్లో జరిగినట్లు తాజాగా ఫిర్యాదు రావడంతో ఈ కేసును మరోసారి విచారించనున్నారు.

ఈ చిత్రంలో అసభ్యత, అశ్లీలతలున్నాయన్న అభియోగాలు, సామాజిక కార్యకర్త దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు వ్యతిరేకంగా రాంగోపాల్‌ వర్మపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు జనవరిలో కేసు నమోదు చేశారు. ఫిబ్రవరిలో విచారణకు పిలిచారు. ఆయన చరవాణి, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని, సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల కోసం ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు. అయితే తాను ఆ చిత్రానికి దర్శకత్వం వహించలేదని, చిత్ర నిర్మాతలు కోరితే.. స్కైప్‌ ద్వారా సూచనలు చేశానంటూ రాంగోపాల్‌ వర్మ అప్పట్లో సైబర్‌ క్రైం పోలీసులకు తెలిపారు. ఆ చిత్రాన్ని పోలెండ్‌లో చిత్రీకరించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్‌ వర్మకు వ్యతిరేకంగా సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ ఠాణాకు వచ్చిన ఫిర్యాదులపై కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Hyd Cyber Police to Issue Fresh Notice to RGV

జీఎస్‌టీ చిత్రం:
జీఎస్‌టీ చిత్రం కథ తనదేనంటూ ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలనూ పోలీసులకు సమర్పించినట్లు తెలిసింది. జీఎస్‌టీ చిత్రాన్ని హైదరాబాద్‌లోనే చిత్రీకరించారని, మియా మాల్కోవాను హైదరాబాద్‌కు రప్పించారని మరో ఇద్దరు ఫిర్యాదు చేశారు. తమ వివరాలను గోప్యంగా ఉంచాలని వీరు పోలీసులను కోరారు. జీఎస్‌టీ చిత్రం షూటింగ్‌ కోసం రాంగోపాల్‌ వర్మ పోలెండ్‌కు వెళ్లారా? లేదా? అని నిర్ధరించేందుకు ఆయన పాస్‌పోర్టును పరిశీలించనున్నారు. ఫోరెన్సిక్‌ ప్రయోగశాల అధికారులు ఇవ్వనున్న నివేదిక కేసులో కీలక పాత్ర పోషించనుందని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు.

- Advertisement -