విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష..

399
Chief Minister K Chandrasekhar Rao
- Advertisement -

ఈ ఏడాది జూలై చివరి నుంచే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నుంచి 2 టిఎంసిలు, వచ్చే ఏడాది నుంచి 3 టిఎంసిల నీళ్లను గోదావరి నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించినట్లు సిఎం చెప్పారు. ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3,800 మెగావాట్లు, వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి మొత్తం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. కావాల్సినంత విద్యుత్ ను సమకూర్చుకుని, గోదావరిలో నీటి ప్రవాహం ఉండే ఆరు నెలల పాటు నిర్విరామంగా 24 గంటల పాటు సరఫరా చేయాలని చెప్పారు. ప్రతీ ఏడాది దాదాపు 540 నుంచి 600 టిఎంసిల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఎం వివరించారు.

ఎత్తిపోతల పథకాలకు వినియోగించే కరెంటు కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సిఎం వెల్లడించారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు పరిశీలించాలని సిఎం సూచించారు. వచ్చే నెల 10వ తేదీలోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపుహౌజుల నిర్మాణం పూర్తి చేయాలని సిఎం చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని లిఫ్టు చేయడానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేసే అంశంపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్ లో విస్తృత సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎంపి జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇఎన్సీ మురళీధర్ రావు, ట్రాన్స్ కో జెఎండి సి.శ్రీనివాసరావు, జెన్ కో-ట్రాన్స్ కో డైరెక్టర్లు సూర్య ప్రకాశ్, వెంకట్రాజం, జగత్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి రోజుకు రెండు టిఎంసిల చొప్పున నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. పంపుల ట్రయల్ రన్లు కూడా విజయవంతమయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచే నీరు లిఫ్టు చేయాలి. ఇందుకు 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. గోదావరిలో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది.

నీటి లభ్యత కూడా మేడిగడ్డ వద్దే ఉంది. కాబట్టి మేడిగడ్డ నుంచి మరో టిఎంసిని కూడా లిఫ్టు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి మేడిగడ్డ నుంచి మూడు టిఎంసిల నీరును లిఫ్టు చేస్తాం. ఇందుకోసం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుంది. గోదావరిలో నీటి ప్రవాహం ఉండే జూన్ నుంచి డిసెంబర్ వరకు నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంటుంది. జూన్, నవంబర్ మాసాల్లో రోజుకు 2 టిఎంసిల చొప్పున, జూలై నుంచి అక్టోబర్ వరకు నెలకు మూడు టిఎంసిల చొప్పున నీరు లిఫ్టు చేయవచ్చు. డిసెంబర్ మాసంలో కూడా ఒక లిఫ్టు నడిపి కొంత నీరు తీసుకోవచ్చు. ఏ నెలలో ఎంత నీరు తీసుకోవచ్చు, దీనికి ఎంత కరెంటు అవసరం పడుతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. ఈ సమయంలో సరిపడినంత విద్యుత్తును సరఫరా చేయడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
‘’85 శాతం తెలంగాణ భూభాగంలో వ్యవసాయానికి, మంచినీటికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని గోదావరి నుంచే తీసుకోవాలి. గోదావరిలో తెలంగాణకు 954 టిఎంసిల నీటి వాటా ఉంది. ఈ నీటిని వాడుకోవడానికి అన్ని రకాల అనుమతులున్నాయి.

ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నాము. 44 ఏండ్ల సి.డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం మేడిగడ్డ వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉంది. కాబట్టి గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో నీటిని లిఫ్టు చేయాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్ మానేరుకు ఈ ఏడాది 2 టిఎంసిలు లిఫ్టు చేయాలి. రివర్స్ పంపింగ్ ద్వారా ఒక టిఎంసిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, మరో టిఎంసిని మల్లన్న సాగర్ కు లిఫ్టు చేయాలి. వచ్చే ఏడాది ఎల్లంపల్లి వరకు మూడు టిఎంసిలు, కొండపోచమ్మ సాగర్ వరకు రెండు టిఎంసిలు నీటిని తరలించి, రిజర్వాయర్లను, చెరువులను నింపాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన 22 లక్షల ఎకరాలకు మాత్రమే కాకుండా, శ్రీరాం సాగర్ ఆయకట్టుకు, గుత్ప-అలీసాగర్ పథకాలకు, నిర్మల్- ముధోల్ నియోజకవర్గాలకు, గౌరవల్లి ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గానికి నీరివ్వాలి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు ఏడాదికి రెండు పంటలకు నీరందించాలి. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంటలు పండించాలి. కేవలం సాగునీరే కాకుండా మంచినీటికి, పరిశ్రమలకు కూడా కాళేశ్వరం ద్వారా నీరందించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, నిర్వహణ భారంపై కొందరు వెలిబుచ్చే అభిప్రాయాలు పూర్తిగా అవగాహన రాహిత్యంతోకూడుకున్నవి. ఒక్కో ప్రాంతానికి అక్కడున్న పరిస్థితులను బట్టి వేర్వేరు ప్రాధాన్యతలుంటాయి.

గల్ఫ్ దేశాల్లో మంచినీళ్లు దొరకవు. అక్కడి ప్రభుత్వాలు ఎక్కువ వ్యయం మంచినీళ్ల కోసమే చేస్తాయి. లాస్ వెగాస్ ప్రాంతానికి మంచినీళ్లు అందివ్వడానికి అమెరికా ప్రభుత్వం 600 కిలోమీటర్ల దూరం నీళ్లను పంప్ చేస్తున్నది. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు ఇవ్వడం ప్రాధాన్యతాంశం. రైతులను బతికించడానికి, వ్యవసాయం సాగడానికి సాగునీటి కోసం ఖర్చు చేస్తాం. ఒక్కసారి కాళేశ్వరం పూర్తయితే జనం బతికిపోతారు. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. ఏడాది రెండేళ్ళలోనే ప్రాజెక్టు నిర్మాణానికి పెట్టిన ఖర్చుకు సమానమైన పంట పండుతుంది. రైతుల జీవితాలు మారుతాయి. తెలంగాణ వాతావరణం మారుతుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నిర్వహణకు మరో వెయ్యి మెగావాట్లు అవసరమవుతుందని సిఎం చెప్పారు. ఎత్తిపోతల పథకాల పంపుసెట్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్తును సమకూర్చాలని, దీనికయ్యే ఖర్చు కోసం రైతుల ఉచిత విద్యుత్ సబ్సిడీ మాదిరిగా ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు ప్రత్యేక గ్రాంటు ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాల కోసం నిర్మించిన సబ్ స్టేషన్లు, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థల నిర్వహణ బాధ్యతను విద్యుత్ సంస్థలే చేపట్టాలని సిఎం చెప్పారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, ఎక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చో శాస్త్రీయంగా సర్వే చేయించాలని సిఎం ఆదేశించారు.

17వేల మెగావాట్లకు సిద్ధం: ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు
ఇతర రంగాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తూనే, కాళేశ్వరంతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్తును నిరాటంకంగా సరఫరా చేస్తామని ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు వివరించారు. సమీక్షలో భాగంగా రాష్ట్ర విద్యుత్ పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. 11వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చినప్పటికీ ఎక్కడా కోతలు లేకుండా సరఫరా చేశామని ప్రభాకర్ రావు వెల్లడించారు. ఎత్తిపోతల పథకాలకు మరో 6వేల మెగావాట్లు అవసరమైనా సమకూరుస్తామని, మొత్తం రాష్ట్ర డిమాండ్ 17వేల మెగావాట్లకు చేరినా, విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తి కూడా పెరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 16,203 మెగావాట్ల స్థాపిత విద్యుత్ అందుబాటులో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, కొద్ది నెలల్లోనే ఎన్.టి.పి.సి. ప్లాంటు ద్వారా 1600 మెగావాట్లు అందుతుందని వివరించారు.

4,000 మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం 28వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా, వందకు వంద శాతం పంపిణీ చేయడానికి అనువైన వ్యవస్థ ట్రాన్స్ కో సిద్ధం చేసిందని వివరించారు.
విద్యుత్ పనులు వేగంగా చేశారు: సిఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి కావల్సిన వ్యవస్థలను శరవేగంగా పూర్తి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థలను అభినందించారు. విధించిన గడువుకన్నా ముందే పనులు పూర్తి చేశారని, సహజంగా ఇంత త్వరగా పనులు పూర్తి కావని చెప్పారు. ఇదే స్పూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి అవసరనమైన అదనపు ఏర్పాట్లు కూడా వేగంగా పూర్తి చేయాలని సిఎం చెప్పారు.
18న రామగుండంలో, 19న కాళేశ్వరంలో సిఎం పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న రామగుండంలో, 19న కాళేశ్వరంలో పర్యటిస్తారు. 18న రామగుండంలో నిర్మాణంలో ఉన్న 1600 మెగావాట్ల ఎన్.టి.పి.సి. పవర్ ప్లాంటును సందర్శిస్తారు. అక్కడే ఎన్.టి.పి.సి., జెన్ కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 19న ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో పనులు పరిశీలిస్తారు.

- Advertisement -